నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబాబాద్ జిల్లాకు, కలెక్టరేట్ సముదాయానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యా పేరు పెట్టాలని నేడు హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో మంత్రి సత్యవతి రాథోడ్ కి దాశరథి కృష్ణమాచార్య కుమారుడు లక్ష్మణ్ వినతిపత్రం అందజేసారు. ఈసందర్బంగా దాశరథి లక్ష్మణ్ మాట్లాడుతూ ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించడమే కాక సాహితీ రంగంలో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అన్నారు. నిజాం నిరంకుశాన్ని ఎదిరించడమే కాకుండా స్వాతంత్ర్యానంతరం సైతం ప్రత్యేక తెలంగాణ పోరాట స్పూర్తిని కొనసాగించిన మహనీయుడిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంటుందని, సీఎం కేసీఆర్ గారు ‘దాశరథి’ పేర సాహిత్య అవార్డును సైతం అందజేస్తున్నారని, అదే రీతిలో తన పుట్టిన గడ్డైన మహబూబాబాద్ జిల్లాకు, నూతన కలెక్టరేట్ సముదాయానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్య పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్ గారికి క్రుతజ్ణతలు చెపుతున్నానన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ గారిని కలువాలనుకుంటున్నానని, నూతన సచివాలయంలో దాశరథి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతానన్నారు దాశరథి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో దాశరథి అభిమానులు, మహబూబాబాద్ వాసులు పాల్గొన్నారు.