మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన డోంబివ్లిలో కరోనా కలకలం సృష్టించింది. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కోవిడ్ 19 పాజిటివ్గా తేలింది. దీంతో ఒక్కసారిగా గందరోళ వాతావరణం నెలకొంది. అయితే ఇది ఒమిక్రాన్ వేరియంట్ అనడానికి మాత్రం ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. పరీక్షల నిమిత్తం అధికారులు శాంపిల్స్ను ల్యాబ్కు పంపించి, సదరు వ్యక్తికి క్వారంటైన్కు తరలించారు.
ఒమిక్రాన్ను నిరోధించే క్రమంలో భారత ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నియంత్రణ, నిఘా పెంచాలని సూచించారు. అలాగే టీకాల పంపిణీని వేగవంతం చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.