భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని పలు గ్రామాలకు మిరప కాయలు కోసేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కూలీలు ఇంటి దారి పట్టారు. లాక్ డౌన్ గడువు పెంచటంతో పలు చోట్ల ఉన్న కూలీలు రాత్రి వేళలోనే కాలినడకన బయలుదేరారు.
వీరంతా ఏన్కూరు మండలం లింగన్నపేట సరిహద్దు చేరుకోగానే అక్కడి యంత్రాంగానికి సమాచారం అందింది. అప్రమత్తమైన స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ట్రాక్టర్ లపై తీసుకొచ్చారు. ఈ సమయంలోనే కొంతమంది కూలీలు వినోభానగర్ సమీపానికి రావటంతో నే తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు అడ్డుకోవడంతో కూలీలు రోడ్డుపై బైఠాయించారు.
వాహనాలు నిలిచిపోయాయి. సున్నితమైన అంశం కావటంతో కొత్తగూడెం ఓఎస్డీ రమణారెడ్డితో పాటు తహసీల్దార్ విజయకుమార్, సీఐలు నాగరాజు, అశోక్, ఎస్సై లు శ్రీకాంత్, రాజేష్ కుమార్, చల్లా అరుణలు పరిస్థితి సమీక్షించారు. పడమట నర్సాపురం లోని ఆశ్రమ పాఠశాల వద్ద మొత్తం 200 మంది కూలీలకు వసతి, భోజన సదుపాయం కల్పించారు.