శానస మండలి రద్దు ప్రతిపాదన చట్టబద్ధం అయితే ముఖ్యంగా నలుగురు పెద్దలు తమ ఉద్యోగాలు కోల్పోతారు. అలా ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులుగా మారే ప్రముఖులలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఉంటారు. వీరిద్దరూ శాసన మండలి సభ్యులుగా ఉంటూ రాష్ట్ర మంత్రి వర్గంలో చేరారు. మండలి రద్దు అయిన తర్వాత ఆరు నెలల్లో వీరు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకపోతే వారి మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉంటుంది.
అదే విధంగా ప్రస్తుతం శాసన మండలి సభ్యుడుగా ఉన్న నారా లోకేష్ తన పదవిని కోల్పోతారు. ఆయన అసెంబ్లీ ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందే కౌన్సిల్ సభ్యుడుగా ఉన్న ఆయన రాజీనామా చేయకపోవడం వల్ల ఎన్నికల తర్వాత కూడా ఆయన మండలి సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కౌన్సిల్ రద్దు ప్రక్రియ పూర్తి అయితే ఆయన కు ఉద్యోగం పోతుంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య నాయకుడు అయిన యనమల రామకృష్ణుడు కూడా తన ఉద్యోగం కోల్పోతారు.