నల్లగొండ జిల్లా దామరచర్ల యాదాద్రి పవర్ ప్లాంటులో పని చేస్తున్న వలస కార్మికులందరికి వారి స్వస్థలాలకు పంపించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ చెప్పారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జెన్ కో అధికారులు, కాంట్రాక్టర్లు, కార్మిక సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిని, సోమవారం ఉదయం జరిగిన ఆందోళనపై సమగ్రంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే సుమారు వెయ్యికి పైగా కార్మికులను వారి స్వస్థలాలకు పంపిచడం జరిగిందని, మిగిలిన వారిని రెండు మూడు రోజులలో వారి గ్రామాలకు పంపించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మహారాష్ట్ర సరిహద్దులలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాహనాలను అనుమతించడం లేదని అందువల్ల కార్మికులు ఇలాంటి పరిస్థితులు అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. కార్మికులు ఎవరైనా నిబంధనలకు అనుగుణంగా స్వంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకుంటే తాము అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
లాక్ డౌన్ నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో వాహనాల్లో వెళ్లేందుకు అనుమతిస్తామని అలాంటి వాహనాల ఏర్పాటుకు జెన్ కో అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక స్వస్థలాలకు వెళ్లే కార్మికులు హైదరాబాద్ మీదుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్లలో వారిని పంపించడానికి నిర్దేశించిన విధంగా, కేటాయించిన సమయం ప్రకారం స్వస్థలాలకు పంపిస్తామని చెప్పారు. కార్మికులు కొంత ఓపిక, సంయమనంతో సహకరించాలని ఎస్పీ రంగనాధ్ చెప్పారు.
సమావేశంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి నల్లగొండ, మిర్యాలగూడ డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు శంకర్ రెడ్డి, నాగేశ్వర్ రావు, జెన్ కో అధికారులు పాల్గొన్నారు.