27.7 C
Hyderabad
April 25, 2024 07: 35 AM
Slider ఆధ్యాత్మికం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు సిద్ధం చేయండి

#Mahashivratri Brahmotsavam

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు పకద్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అన్నపూర్ణ భవనం ప్రక్కన గల సీసీ కంట్రోల్ రూమ్ నందు జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారిచక్రపాణిరెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నలతో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 21 వరకు 11 రోజులపాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క చిన్న సంఘటన జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు.

ప్రధానంగా ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీటి సదుపాయం తదితర అంశాలపై అప్పగించిన విధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్వర్తించాలని జోనల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రద్ధీ ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలతో పాటు వైద్యనిపుణులు, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని డీఎంఅండ్ హెచ్‌ఓను ఆదేశించారు. అలాగే దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ మెటిరీయల్ సిద్ధంగా ఉండాలని మలేరియా అధికారిని ఆదేశించారు. శ్రీశైలంలోని పిహెచ్‌సి, దేవస్థానం ఆసుపత్రి, సున్నిపెంటలోని వైద్యశాల, శ్రీశైలంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల ఆసుపత్రి 24 గంటలపాటు నిర్వహించేలా వైద్యసిబ్బందిని కేటాయించాలని డి.ఎం. అండ్ హెచ్.ఓను ఆదేశించారు.

ముఖ్య ప్రదేశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో రెండు షిఫ్టులలో వైద్యులు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడు 108 అంబులెన్సులు, పాదయాత్రమార్గములో ఒక అంబులెన్సును ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రాహ్మణకొట్కూరు నుండి శ్రీశైలం వరకు గతంలో సూచించిన విధంగా 24 ప్రదేశాలలో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాతాళగంగ, లింగాలగట్టు ప్రాంతాలలో పుణ్యస్నానాలాచరించేందుకు అనుమతిస్తున్నామని, ఇందుకు ప్రతిపాదించిన 240 మంది గజ ఈతగాళ్ళు, అవసరమైన లైఫ్ జాకెట్లు, పుట్టీలు, తాత్కాలిక టాయిలెట్లు, డ్రస్సింగ్ గదులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ డిడిని, దేవస్థానం పారిశుద్ధ్య విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారులను కలెక్టర్ ఆదేశించారు.

రవాణా సౌకర్యాల నిమిత్తం ఆంధ్ర ప్రాంతం నుండి 650 బస్సులు, తెలంగాణా నుండి 180 బస్సులు, కండిషన్‌లో ఉన్న బస్సులు ఏర్పాటు చేయాలని, అలాగే మార్గమధ్యములోని ముఖ్య కూడళ్ళలో క్రేన్లు, అవసరమైన మెకానిక్‌లను ఏర్పాటు చేయాలని ఏపిఎస్ ఆర్‌టిసి ఆర్.ఎం. ను ఆదేశించారు. వీఐపీలు, వీవీఐపీలు, విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి వసతి ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా దేవస్థాన గదులు మరియు ప్రవైటు సత్రాలలోని 35 శాతం గదులను స్వాధీనం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్‌డిఓను ఆదేశించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి చేరుకుంటారని, ఎక్కడ పారిశుద్ధ్యలోపం లేకుండా అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించుకుని దేవస్థాన శానిటేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యలోపం లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిపిఓను కలెక్టర్ ఆదేశించారు. అన్నదాన శిబిరాలు, రద్ధీ కూడలి ప్రాంతాలలో అధిక పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు.

ఆత్మకూరు నుండి దోర్నాల వరకు రోడ్డు ప్యాచింగ్ మరమ్మతులు, రేడియం స్టిక్కర్లు, రోడ్డుకిరువైపులా మట్టితో చదును చేసే పనులు వెంటనే ప్రారంభించాలని ఆర్‌అండ్‌బి ఈఈని కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 11 నుండి 21వ తేదీ వరకు అత్యధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి వచ్చే అవకాశం ఉన్నందున అదనపు సౌకర్యాలు కల్పించడంతో పాటు సిబ్బంది మొత్తం అప్రమత్తంగా వుండి, భక్తులకు సేవలు అందించే కార్యక్రమంలో నిమగ్నం కావాలన్నారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న మాట్లాడుతూ భక్తులకు సులభంగా స్వామివారి దర్శనం అయ్యేలా నాలుగు రకాల క్యూలైన్లను ఏర్పాటు చేశామని కలెక్టర్‌కు వివరించారు. సంబంధిత జోనల్ అధికారి, వీఐపి ప్రోటోకాల్‌తో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నామన్నారు. 13వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారి దేవస్థానం, 14వ తేదీన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామివారి దేవస్థానం, మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, 15వ తేదీన ప్రభుత్వం తరుపున స్వామిఅమ్మవార్ల పట్టువస్త్రాలను సమర్పిస్తారన్నారు.

భక్తులకు అందించే స్వామిఅమ్మవార్ల లడ్డూ ప్రసాదాలను 30 లక్షల వరకు తయారు చేస్తున్నామన్నారు. ఈ నెల 18వతేదీ మహాశివరాత్రిపర్వదినాన్ని పురస్కరించుకుని సాయంకాలం ప్రభోత్సవం అనంతరం రాత్రి 10 గంటల నుండి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాస రుద్రదాభిషేకం, అర్థరాత్రి 12 గంటలకు కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. మరుసటి రోజు రథోత్సవం, తెప్పోత్సవం ఉంటాయని కలెక్టర్‌కు వివరించారు.

ప్రధానంగా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా గుర్తించిన ప్రదేశాలలో ట్యాంకర్లు, నీటికొళాయిలు ఏర్పాటుకు దేవస్థానం ఈఈ వి. రామకృష్ణతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారీ వాహనాలను అటవీమార్గంలో అనుమతించకుండా డైవర్ట్ చేసే విధంగా ప్రకాశం, నాగర్ కర్నూలు, కర్నూలు జిల్లాలలో విస్తృత ప్రచారం చేయాలని ట్రాన్స్‌ఫోర్ట్, సంబంధిత ట్రాఫిక్ డిస్పీలను ఆదేశించారు.

శ్రీశైలాలయాన్ని 10 జోన్లు, 40 సెక్టార్లుగా విభజించి జిల్లాస్థాయి అధికారులకు ఇంచార్జులుగా నియమించామని, ఏ ఒక్క చిన్న పొరపాటు జరగకుండా సంబంధిత అధికారులతో కో ఆర్డినేట్ చేసుకోవాలని, ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు అదనంగా మరో 50 సీసీ కెమెరాలతో కవరేజ్ చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో కూడా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తూ తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌కు వివరించారు. 11 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు దాదాపు 8 లక్షల మందికి పైగా భక్తుల వచ్చే అవకాశం ఉన్నందున మోబైల్ నెట్ వర్క్ సరిపోయే విధంగా బీఎస్ఎన్ఎల్ పాటు ఎయిర్‌టెల్, జియో, ఐడియా సంస్థలతో మైక్రో టవర్లు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓకు సూచించారు. కల్తీ ఆహారపదార్థాలు నియంత్రించేందుకు లేబరు కమీషనర్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లను టీమ్‌గా ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా అన్ని జోన్లకు నిరంతరాయ విద్యుత్ ఏర్పాటు చేయాలని ఏపిఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పార్కింగ్ ప్రదేశాలలో దాదాపు 3వేల వాహనాలను నిలుపుదల చేసేందుకు అవకాశం ఉందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి తాను, కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తూ తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ యంత్రాంగానికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని ఆయన కోరారు. పాగాలంకరణ ముగిసిన వెంటనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆయన తెలిపారు.

అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లు, ఆలయం, గంగాధరమండపం, శ్రీలలితాంబికా షాంపింగ్ కాంప్లెక్ట్‌ తదితర వాటిని పరిశీలించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Related posts

రాజంపేట ఎమ్మెల్యే మేడా కు భత్యాల చెంగల రాయుడు బహిరంగ సవాల్

Satyam NEWS

ఆరోగ్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల

Satyam NEWS

పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కడప జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment