జీ 20 నాయకత్వానికి సంబంధించి ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అజ్మీర్ దర్గాను, పుష్కర్ ఆలయాన్ని సందర్శించారు. ఇప్పుడు ఈ విషయంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఆమె అజ్మీర్ దర్గాకు వెళ్లి అక్కడ చాదర్ సమర్పించారు. పుష్కర్ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీటన్నింటితో బాటు పుష్కర సరోవరంలో స్నానం కూడా చేసి ఉండాల్సింది అంటూ మమత రాజకీయ ప్రత్యర్థి లెఫ్ట్ ఫ్రంట్ అధ్యక్షుడు బిమన్ బసు ఎద్దేవా చేశారు.
మమతా బెనర్జీ అజ్మీర్కు వెళ్లి చాదర్ అందించడం ‘‘చాలా గొప్ప కార్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత పుష్కరాలయంలో పూజలు చేసిన మమతా బెనర్జీ అక్కడే పుణ్య స్నానం కూడా చేసి ఉండాల్సిందని, అయితే మమతా బెనర్జీ ఎన్నో పాపాలు చేసిందని, వాటిని కడగడానికి పుష్కర్ సరోవర్లో స్నానం చేసినా కూడా సరిపోదని బిమన్ బసు అన్నారు.