ప్రజలు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వచ్చినప్పుడు వెంటనే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని, ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారని జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ షిండే అన్నారు. శుక్రవారం బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ అధ్యక్షతన మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొని మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తుందన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలచి ప్రతి ఇంటికి ప్రభుత్వం ద్వార అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలన్నారు. అధికారులు ప్రజల సమస్యల పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.
బిచ్కుంద మండల కేంద్రంలో, హస్గుల్, బండ రెంజల్, వాజిద్ నగర్, శాంతాపూర్ గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు సరైన పోషకాహారం అందించడం లేదని దీంతో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని అంగన్వాడిల సెంటర్లపై పర్యవేక్షణ కరువైందని ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించే కార్యక్రమాలకు సర్పంచ్లకు, ఎంపిటిసిలకు సమాచారం ఇవ్వడం లేదంటూ సభ దృష్టికి తీసుకువచ్చారు.
బిచ్కుంద తో పాటు ఆయా గ్రామాలలో అంగన్వాడి సెంటర్ల నూతన భవనాల నిర్మాణం కోసం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారని భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని సభ దృష్టికి తీసుకొచ్చారు. శాంతా పూర్, ఫథలాపూర్, హస్గుల్ గ్రామాలలో పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని నూతన భవనాలు నిర్మాణం చేపట్టాలని సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చారు.
త్రాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర గ్రామాల్లో సమస్యలను ప్రజా ప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రస్తావించిన ప్రజల సమస్యలను అధికారులు అలసత్వం వహించకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి భారతి రాజు, వైస్ ఎంపీపీ రాజు పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయవ్వ సాయిరాం, ఎంపీడీవో ఆనంద్, డిప్యూటీ తాసిల్దార్ మునీరుద్దీన్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.