తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రూ.5 లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన ప్రతి కుటుంబానికి ఆరోగ్య శ్రీ కార్డు మంజూరు చేస్తాం. పేదల ఆరోగ్య భద్రతే మా లక్ష్యం. అంటూ ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది.
తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో కార్డు మంజూరు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని 32 వార్డుల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేశారు.
పంపిణీ చేసిన కొన్ని కార్డుల్లో తప్పులు దొర్లినా వాటిని సైతం సరి దిద్దే దిశగా చర్యలు చేపట్టలేదు. ఇక రేషన్ కార్డు లేని అర్హులైన వారు ఆరోగ్య శ్రీ కార్డు కావాలంటూ గత ఏడాది చివర్లో దరఖాస్తు చేసుకున్నారు.10 నెలలు గడుస్తున్నా నేటికీ కార్డులు పంపిణీ చేయలేదు.కార్డు మంజూరైనట్లు కొందరి చరవాణిలకు సందేశాలు వచ్చాయి.
సదరు సందేశాలతో సచివాలయాల్లో సంబంధిత వెల్ ఫెర్ సెక్రెటరీ ల వద్దకు వెళ్తే కార్డు తమ వద్దకు చేరలేదని సమాధానమిస్తున్నారు. ఎప్పుడు పంపిణీ చేస్తారు?అన్న విషయం పై అధికారులకె తెలియని పరిస్థితి నెలకొంది.
దీనితో ధరఖాస్తుదారులకు సమాధానం ఇవ్వలేక తెల్ల మొఖం వేస్తున్నారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికే నేటికీ కార్డు అందకపోతే దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో ఆరోగ్య శ్రీ కార్డులు పంపిణీ చేస్తామని ఇటీవల క్రొత్త ప్రచారం మొదలు పెట్టటం ప్రజల్లో విమర్శలకు తావిస్తోంది.
పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు వై ఎస్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టింది. ఆరోగ్య శ్రీ కార్డుల మంజూరు లో తలెత్తే లోపాలను పరిష్కరించకపోవడం అర్హులైన వారిని ఆరోగ్య శ్రీకి దూరం చేస్తుంది.
ప్రాణాంతక మహమ్మారి కరోనా విజృంభిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో అర్హులైన వారందరికీ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయాలి. ఇందుకు ఉన్న శాఖా పరమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది.
మున్సిపల్ కమీషనర్ వివరణ
మంగళగిరి పట్టణంలో మొత్తం 21,559 కుటుంబాలకు ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాల్సి ఉందని మంగళగిరి మున్సిపల్ కమీషనర్ హేమమాలినీరెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వాతిలో 869 కార్డులు తమకు చేరాల్సి ఉందని అన్నారు. మిగిలినవి పంపిణీ చేయించామని స్పష్టం చేశారు.