దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పాలక వర్గాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి ప్రజల కోసం పని చేస్తున్న మావోయిస్టులను మట్టుపెడుతున్నారని ఏవోబీ నిశితంగా విమర్శించింది.
విశాఖ పట్నం జిల్లా కొయ్యూరు మండలం లోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో తీగల మెట్ట అటవీ ప్రాంతంలో ఈ నెల 17న జరిగిన బూటకపు ఎన్ కౌంటర్ ను మావోయిస్టులు తీవ్రంగా ఖండించారు. ఆరుగురు మావోయిస్టు నాయకులను పోలీసులు అక్రమంగా దాడి చేసి తుదముట్టించారని వారన్నారు.
ఈ మేరకు వారు నేడు ఒక లేఖ విడుదల చేశారు. పోలీసులు చేసిన ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా 1వ తేదీన బంద్ నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు.
ఎం కె వి బి డివిజన్ కమిటీ సభ్యుడు రణదేవ్, డివిసిఎం కరీంనగర్ జిల్లా సందె గంగయ్య, ఏసిఎం కడితి పాయికే, మడకం అంజన్న (బిజాపూర్) మడకం పాయికే, లలిత (తూర్పుగోదావరి జిల్లా) తీగలి మెట్ట ఎన్ కౌంటర్ లో అమరులయ్యారని వారు తెలిపారు.
కరోనా కష్ట కాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టని స్థితిలో మావోయిస్టులు ప్రజలకు సాయం చేస్తున్నారని వారన్నారు. ఇలా పాలక వర్గంపై తిరుగుబాటు చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్న తమపై పాశవికంగా దాడి చేశారని వారు తెలిపారు.
జగన్ ప్రభుత్వం ఆదివాసి ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడం అనే ఏకైక లక్ష్యంతోనే పని చేస్తున్నదని, దానికి అడ్డుకట్టగా ఉన్న మావోయిస్టులను సమూలంగా నిర్మూలించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వారు తెలిపారు.
వందలాది మంది పోలీసులను ఆదివాసి ప్రాంతాలలోకి పంపిస్తున్నదని మావోయిస్టులు ఆరోపించారు. తీగలి మెట్ట ఎన్ కౌంటర్ కారణంగా ప్రజా ఉద్యమానికి తీరని విఘాతం కలిగిందని అయితే ప్రజల సాయంతో ఈ లోటును భర్తీ చేసుకుంటామని వారు తెలిపారు.
ఆంధ్రా ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటి కార్యదర్శి గణేష్ పేరుతో ఈ లేఖ విడుదల అయింది.