దాదాపు వందేళ్లుగా నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మర్కజ్ నిజాముద్దీన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తబ్లీక్ జమాత్ కు అంతర్జాతీయ హెడ్ క్వార్టర్స్ ఇదేనని ఆయన అన్నారు. ప్రతీ కార్యక్రమం 3 నుంచి 5 రోజులే ఉంటుందని, ఏడాది ముందే కార్యక్రమ తేదీలు ఖరారవుతాయని ఆయన స్పష్టం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో జనతా కర్ప్యూ ప్రకటించగానే రైళ్లు రద్దు కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఆయన వివరించారు. రైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో 22న చాలా మంది ఢిల్లీలో చిక్కుకున్నారని, 22న రాత్రి 9 గంటల వరకూ జనతా కర్ఫ్యూ దృష్ట్యా ఎవరూ బయటికి రాలేదని వివరించారు.
ఆ తర్వాత స్వస్ధలాలకు వెళ్దామన్నా చాలా మందికి సాధ్యం కాలేదని తెలిపారు. జనతా కర్ఫ్యూ ఎత్తేయగానే ఢిల్లీ ప్రభుత్వం 31 వరకూ లాక్ డౌన్ ప్రకటించిందని అందువల్ల ఎవరికి తోచిన మార్గాల్లో వారు స్వస్ధలాలకు బయలుదేరారని అన్నారు. 23న కేంద్రం ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ పొడిగించడంతో మరిన్ని సమస్యలొచ్చాయని తెలిపారు.
24న లాక్ డౌన్ నేపథ్యంలో మర్కజ్ మూసేయాలని ఢిల్లీ పోలీసులు నోటీసిచ్చారని 24 వ తేదీనే ప్రభుత్వం నుంచి 17 వాహనాల పాస్ లు తీసుకుని కొందరు వెళ్లిపోయారని, మిగిలిన కొందరికి ఢిల్లీ ప్రభుత్వం ఆ తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిందని వివరించారు.
28న ఢిల్లీ పోలీసులు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పేరుతో నోటీసులిచ్చారని స్ధానిక అధికారులతో తమ సంప్రదింపుల వివరాలతో సమాధానంలో తెలిపామని వెల్లడించారు. 29న సోషల్ మీడియా పుకార్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ మర్కజ్ పెద్దలపై చర్యలకు ఆదేశించారని తెలిపారు.
లాక్ డౌన్ సందర్భంగా మర్కజ్ లో చిక్కుకున్న వారిని ఇళ్లకు పంపేందుకే ప్రయత్నించాం. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా ఫలించకపోవడంతో మర్కజ్ లో జనం ఉండిపోయారు. కేజ్రీవాల్ కార్యాలయం వాస్తవాలను నిర్ధారించుకోవాలని మనవి చేస్తున్నాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో మేం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మర్కజ్ ను క్వారంటైన్ గా ఆస్పత్రిలో మార్చుకోవచ్చునని వారు తెలిపారు.