నల్గొండ జిల్లా చిట్యాల పట్టణంలో ఇంటింటికి మాస్కుల పంపిణీ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుంది. కరోనా మహమ్మారి పట్టణంలోకి ప్రవేశించకుండా స్థానిక మున్సిపాలిటీ పాలకవర్గం కంకణ బద్ధులై పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అన్ని వార్డుల్లో శానిటేషన్ పిచికారి చేయించింది.
ప్రజలు కరోనా నివారణలో చేపట్టవలసిన విషయాల మీద మైకుల ద్వారా రోజు ప్రచారం చేస్తోంది. ప్రజలు కరోనా బారిన పడకుండా మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్ రెడ్డి అధ్యక్షతన పాలకవర్గం సమావేశాన్ని నిర్వహించి పట్టణ ప్రజలందరికి మాస్కులను పంచి పెట్టాలని నిర్ణయించింది.
దీని కోసం 15 వేలు మాస్కులను తయారు చేయించింది. వీటి తయారీకి రూ. 2 లక్షలు బడ్జెట్లో కేటాయించి మహిళా సంఘాల చే మాస్కులను తయారు చేయించారు. స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య ఇంటింటికి మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని గత బుధవారం ప్రారంభించారు.
గురువారం రోజున పట్టణం లోని 12 వార్డుల్లో కౌన్సిలర్లు గడప గడప తిరిగి ప్రతీ వ్యక్తికి మాస్కును అందించారు. ప్రజలు బయటికి వెళ్లే పరిస్థితి వస్తే మాస్కును తప్పకుండా వాడాలని ఈ సందర్బంగా సూచిస్తున్నారు. కరోనా సోకని పట్టణంగా చిట్యాలను నిలపాలన్న పాలకవర్గ ప్రయత్నాన్ని పట్టణ పౌరులు హర్షిస్తున్నారు.