అన్నీ వర్గాల ప్రజలు మాస్కులు ధరించి కరోనాను ఎదుర్కోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఉదయం జిల్లా యోగా అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ, రెడ్ క్రాస్ సిద్ధిపేట ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మంత్రి మాస్కులు పంపిణీ చేశారు.
కరోనా కట్టడికి ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత కంటే ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిదని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వ్యవహరించే జర్నలిస్టులకు మాస్కులు పంపిణీ చేస్తున్న యోగా అసోసియేషన్, రెడ్ క్రాస్ ప్రతినిధులను మంత్రి అభినందించారు.
యోగా సొసైటీలు ఈ విపత్కర పరిస్థితిలో ఆన్ లైనులో యోగా తరగతులు నిర్వహించడంతో పాటు విభిన్న వర్గాల వారికి మాస్కులు పంపిణీ చేసేందుకు సంకల్పించినందుకు మంత్రి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ కమిటీ సభ్యులు కే.అంజయ్య, జిల్లా వర్కింగ్ జర్నలిస్టు సంఘం అధ్యక్షులు కే.రంగాచారి, జర్నలిస్టు సంఘ నేతలు ఆకుల పాండు రంగం, రఘు, మజ్జులు పాల్గొన్నారు.
వారితో పాటు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు తోట అశోక్, వ్యాస మహర్షి యోగ సొసైటీ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యోగ శిక్షకులు తోట సతీష్, రెడ్ క్రాస్ సభ్యులు డాక్టర్ అరవింద్, లింగమూర్తి, రాము యోగా అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కాశీనాథ్, బొజ్జ అశోక్, విక్రమ్ రెడ్డి, శివకుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.