బహవల్పూర్లోని జైషే మహ్మద్ (జెఎం) ప్రధాన కార్యాలయంపై భారతదేశం జరిపిన క్షిపణి దాడిలో తన కుటుంబంలోని 10 మంది సభ్యులు మరియు నలుగురు సన్నిహితులు మరణించారని ఆ సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ బుధవారం అంగీకరించారు. బహవల్పూర్లోని జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో మరణించిన వారిలో జైషే మహ్మద్ అధినేత అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరొక మేనకోడలు, అతని కుటుంబంలోని ఐదుగురు పిల్లలు ఉన్నారని అజార్ విడుదల చేసినట్లు చెబుతున్న ప్రకటనలో పేర్కొన్నాడు.
ఈ దాడిలో అజార్ సన్నిహితులలో ఒకరు, అతని తల్లి, మరో ఇద్దరు సన్నిహితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 1999లో IC-814 హైజాక్ చేయబడిన ప్రయాణీకులకు బదులుగా అజార్ను భారత్ విడుదల చేసిన తర్వాత అతను బహవల్పూర్ జెఎం కేంద్రంగా మార్చుకున్నాడు. అజార్ ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్ కోరినా అంతర్జాతీయ సమాజం అంగీకరించలేదు. మరీ ముఖ్యంగా చైనా అభ్యంతరం పెట్టింది. అయితే భారత్ తెచ్చిన వత్తిడితో అన్ని దేశాలూ అంగీకరించి దశాబ్దం తర్వాత, జైషే మహమ్మద్ చీఫ్ను బ్లాక్లిస్ట్ చేస్తూ 2019 మేలో ఐక్యరాజ్యసమితి అజార్ను “గ్లోబల్ టెర్రరిస్ట్”గా ప్రకటించింది.
ఏప్రిల్ 2019 నుండి బహిరంగంగా కనిపించని అజార్, బహవల్పూర్లోని “సురక్షితమైన ప్రదేశంలో” దాక్కున్నట్లు భావిస్తున్నారు. ఈ బృందం భారతదేశంలో జరిగిన వరుస ఉగ్రవాద దాడుల్లో పాల్గొంది. వాటిలో 2001లో పార్లమెంటుపై దాడి, 2000లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్కోట్లోని IAF స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి బాంబు దాడి ఉన్నాయి. ఇదిలా ఉండగా, బహావల్పూర్ దాడిలో గాయపడిన వారందరినీ విక్టోరియా ఆసుపత్రికి తరలించి, ఉత్తమ చికిత్స అందించామని పంజాబ్ సమాచార మంత్రి అజ్మా బొఖారి తెలిపారు. ఈ దాడిలో 26 మంది మరణించగా, 46 మంది గాయపడ్డారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.