34.2 C
Hyderabad
April 19, 2024 22: 48 PM
Slider ఆధ్యాత్మికం

నేటి నుంచే మేడారం మహా జాతర

Medaram 041

తెలంగాణ కుంభమేళాగా ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర నేటి నుంచి నాలుగు రోజుల పాటు వైభవంగా జరగనుంది. నేటి సాయంత్రం భక్తుల కోలాహలం నడుమ డప్పు వాయిద్యాలు హోరెత్తుతుండగా కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకుంటుది. ఇదే సమయంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరి భక్తుల పూజలందుకుంటారు. విద్యుద్దీపకాంతులతో మేడారం పరిసరాలు ధగధగలాడుతున్నాయి.

హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మేడారంలో మాఘ పౌర్ణమి సందర్భంగా బుధవారం జాతర ప్రారంభమై.. శనివారం వరకు (16వ తేదీ నుంచి 19 వరకు) జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 18న వన దేవతలను దర్శిస్తారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది.

దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మొత్తం కోటిన్నర మంది వరకు సందర్శించే వీలుందనేది అధికారుల అంచనా.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి జాతర ఏర్పాట్లను ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు. మంగళవారం మేడారం సమీపంలోని కన్నెపల్లె నుంచి పూజారులు సమ్మక్క కుమారుడు జంపన్నను తీసుకొచ్చి గద్దెపై కొలువుదీర్చారు.

మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి డోలు వాయిద్యాలు, శివసత్తుల నృత్యాలతో సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పాదయాత్రగా పూజారులు మేడారానికి బయలుదేరారు.  24 గంటల పాదయాత్ర తర్వాత పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకుంటారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజున చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడో రోజున అమ్మవార్లు ఇద్దరూ దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వారిని వన ప్రవేశం చేయిస్తారు.

భక్తులకు సౌకర్యాలు

జాతర ప్రాంగణంలో రూ.75 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.  వరంగల్‌ నుంచి వచ్చే ప్రధాన రహదారిని విస్తరించారు. నాలుగు వేల ఆర్టీసీ బస్సులు సహా దాదాపు 50 లక్షల వాహనాలు జాతరకు వచ్చే వీలుంది. ఎప్పటి చెత్త అప్పుడే తొలగించడం, దుమ్ము రేగకుండా నీళ్లను చల్లడం వంటి చర్యలు చేపట్టారు. భక్తుల కోసం 327 ప్రాంతాల్లో 20వేలకు పైగా శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించారు. పార్కింగు కోసం 1,100 ఎకరాలు కేటాయించారు.

32 ఎకరాల్లో బస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. జంపన్నవాగు వరకు 25 మినీ బస్సులు నిరంతరం నడిచే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈసారి భక్తుల విడిది కోసం శాశ్వత ప్రాతిపదికన 5 భారీ షెడ్లు నిర్మించారు. జాతరకు ట్రాఫిక్‌ రద్దీ ప్రధాన సమస్య కాగా.. దానిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. మాస్క్‌లతో పాటు శానిటైజర్లను సైతం పంపిణీ చేస్తోంది. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

Related posts

పాపం పండింది: ఏసీబీ ఉచ్చుకు చిక్కిన ఎస్ ఆర్ ఓ మూర్తి

Bhavani

నువ్వంతే…….

Satyam NEWS

చిరంజీవి సినిమాను ఎత్తేసిన ధియేటర్ ఎదుట ఆందోళన

Satyam NEWS

Leave a Comment