ఇప్పుడు ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా…సంఘటనా స్థలికి వెళ్లక్కరలేదు. ఆఫీసులో కూర్చునే ఎవ్వరితే ప్రారంభించదలచుకున్నారో..వారిచే చిన్న బటన్ నొక్కించితే సంబంధిత ప్రదేశంలో ఏ భవన నిర్మాణానికై శంకు స్థాపన అయినా…ప్రారంభోత్సవం అయినా ఇట్టే జరిగిపోయే ఆధునికత పరిజ్ఙానం నేడు సర్వత్రా వచ్చేసింది.
ఇవన్నీ మాకు తెలుసు..ఈ సొది ఎందుకంటారా..? అక్కడకే వస్తున్నా. ఏపీ సీఎం జగన్ ఈ నెల 31 న రాష్ట్రంలోని విజయనగరం శివారు గాజులరేగ వద్ద…500 కోట్లతో వైద్య కళాశాలకు శంకు స్థాపన చేయనున్నారు…అదీ వర్చువల్ విధానం ద్వారా.
ఈ మేరకు గాజులరేగ వద్ద వైఎస్ఆర్ నగర్ కు వెళ్లే మార్గంలో జిల్లా రెవిన్యూ యంత్రాంగం నిర్దేశించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ డా.హరి జవహర్ లాల్,వైఎస్ఆర్సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశీను)లతో పాటు జేసీ మహేష్ కుమార్, డీఆర్ఓ గణపతిరావు,ఏపీ హెచ్ ఎంఐడీసీ ఈఈ సత్యప్రభాకర్,విజయనగరం ఆర్డీఓభవానీ శంకర్ లు సంయుక్తంగా శంకుస్థాపన చేయనున్న వైద్యకళావాల భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు .
ఈ సందర్భంగా మీడియాను కూడా జిల్లా సమాచార శాఖ తీసుకెళ్లింది. నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల శంకుస్థాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్ర సీఎం జగన్ వర్చ్యువల్ విధానంలో వైద్య కళాశాలకు శంకుస్థాప చేస్తారన్నారు.ఈ సందర్భంగా గాజులరేగ వద్ద ఏర్పాటుచేసిన శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులంతా పాల్గొంటారన్నారు.
దాదాపు 500 కోట్లతో 70 ఎకరాల విస్తీర్ణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయనగరంలో వైద్య కళాశాల ఏర్పాటవుతుందోన్నారు. ఇప్పటికే వైద్య కళాశాల నిర్మాణ సంస్థను కూడా ఖరారు చేయడం జరిగిందని… ఈ కళాశాల పక్కనే 5 ఎకరాల విస్తీర్ణంలో 100 పడకల ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి కూడా నిర్మితమవుతోందన్నారు.
ఈ రెండు అందుబాటులోకి వస్తే జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
అనంతరం వైఎస్ఆర్సీపీ జిల్లా నేత మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను) మాట్లాడుతూ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన వైద్య కళాశాల ఏర్పాటు సీఎం జగన్ నేతృత్వంలో నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
ఎన్నికల సందర్భంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నందుకు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నానన్నారు.