నవమాసాలు బిడ్డను మోసిన ఆ మాతృమూర్తి పండంటి బిడ్డకు జన్మనిస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అది జరగలేదు సరికదా నిండు గర్భిణి నిండు నూరేళ్లూ నిండిపోయాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ తల్లి అనంత లోకాలకు చేరుకున్న హృదయ విదారక సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల నాగరాణి (26) ని ప్రసవం కోసం ఘట్ కేసర్ లోని శ్రీ వెంకట సాయి నర్సింగ్ హోమ్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రసవం చేసే సమయంలో చిన్నారికి జన్మనిస్తున్న తరుణంలో అధిక రక్తస్రావం కావడంతో ఆ తల్లి తన కూతుర్ని కనీసం కడసారి చూపు కూడా చూసుకోకుండా అనంతలోకాలకు వెళ్లిపోయింది.
ఈ విషయం గమనించిన వైద్యులు బయటకు పొక్కితే ఎక్కడ తమకు చెడ్డ పేరు వస్తుందోనని వెంటనే హడావుడిగా మల్లాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కి తరలించారు. ఇది గమనించిన బాధిత బంధువులు ఆసుపత్రి ముందు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.