సినీ నటుడు మంచు మనోజ్ పై జరిగిన దాడి అతి తీవ్రమైనదని మెడికల్ రిపోర్టు స్పష్టం చేస్తున్నది. ఆయన తండ్రి మోహన్బాబుతో ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మనోజ్పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.
మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారని ప్రచారం జరుగుతోంది. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదని సమాచారం.
దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు. విష్ణు జల్పల్లిలోని ఇంటికి వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ముంబై నుంచి మంచు లక్ష్మి వచ్చినట్లు సమాచారం. మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. మనోజ్కు ఎంఎల్సీ (మెడికో లీగల్ కేసు) పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్థారించారని తెలిసింది.
సిటీ స్కాన్, ఆల్ట్రా సౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించగా సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలిసింది. మంచు మనోజ్ ఎడమవైపు ఉన్న భుజానికి గాయం అయినట్లు మెడికల్ రిపోర్ట్లో వైద్యులు పేర్కొన్నారు. మంచు మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. జల్లిపల్లి ఫామ్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్లో వైద్యులు పేర్కొన్నారు. వెన్నుముకపై దాడి జరిగినట్లు గుర్తించారు.
సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు వైద్యులు నిర్వహించారు. పొట్ట , వెన్న పూస, నెక్ కు కనిపించని గాయం అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆస్తుల పంపకాల్లో మా ఇంట్లో గొడవలు జరిగాయని.. మనోజ్ను నేను కొట్టానని మీడియాలో షికార్లు చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు సూచించారు.