ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కు సికింద్రాబాద్లోని సైనిక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆయనపై లాకప్ లో దౌర్జన్యం జరిగిందనే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ డి.నాగార్జున ను ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల నివేదిక పూర్తి కాగానే తెలంగాణ హైకోర్టు సీల్డ్కవర్లో సుప్రీంకోర్టుకు పంపింది. వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీయించి సీల్డ్ కవర్లో భద్రపరిచారు. రఘురామకు రక్త, చర్మ, ఇతర పరీక్షలు నిర్వహించారు. బయటి నుంచి చర్మవ్యాధి నిపుణుడిని రప్పించి పరీక్షించినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్ సైనికాసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. వైద్యపరీక్షలన్నీ కొవిడ్ నిబంధనల మేరకు నిర్వహించినట్లు తెలిపాయి.
previous post