శాస్త్రీయ విద్యా సాధన , సమసమాజ స్థాపన కోసం తమ ప్రాణాలను అర్పించిన విద్యార్థి అమరవీరుల వర్ధంతి సభలను జిల్లా వ్యాప్తంగా నవంబర్ 3 నుండి 9 వరకు జరపాలని పిడిఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆజాద్ వెంకటేష్ లు పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో పి డి ఎస్ యు జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న క్రమంలో అనేకమంది విద్యార్థి రత్నాలు తమ ప్రాణాలు అర్పించారన్నారు. ఆ విద్యార్థి అమరవీరుల ఆశయ సాధన కోసం అకుంటిత దీక్షతో పని చేయాల్సిన అవసరం నేటి విద్యార్థుల పైన ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా కాషాయీకరణను వ్యతిరేకించడంతోపాటు విద్యా ప్రైవేటీకరణ, కాషాయీకరణ, కార్పొరేటికరణకు వ్యతిరేకంగా బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడం కోసం విద్యార్థులు సంఘటితం అయి ఉద్యమించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న క్రమంలో అమరులైన విద్యార్థి రత్నాలు చార్జిరెడ్డి, జంపాల శ్రీపాద, శ్రీహరి రంగవల్లి, కోలా శంకర్, చేరాలు స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ఈ క్రమంలో అసువులు బాసినటువంటి అమరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను నెమరు వేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైన ఉందని విద్యార్థులను ఘనమైన నివాళులు అర్పించడం కోసం నవంబర్ 3 నుండి 9 వరకు అమరవీరుల వర్ధoతి సభలను ప్రతి కళాశాల, గ్రామ, మండల, స్థాయిలలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా జరపాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు మురళి, సహయ కార్యదర్శి నవీన్, కోశాధికారి కిరణ్, నాయకులు లక్ష్మణ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు