మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి తరపున క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు లేదని ఆయన ప్రత్యర్థి మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు తీవ్రంగా ఖండించారు. టీవీ 5 లో మోడరేటర్ మూర్తి నేడు నిర్వహించిన కార్యక్రమంలో నాగబాబు ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కే చిరంజీవి మద్దతు ఉంటుందని వివరణ ఇచ్చారు. చిరంజీవి, తాను, పవన్ కల్యాణ్ అందరం ప్రకాష్ రాజ్ కు అండగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందు కూడా ఆయన మా ఎన్నికలకు సంబంధించిన కొత్త విషయాలను బయటపెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొందరు ఓటుకు రూ.10వేలు ఇస్తున్నారని నాగబాబు ఆరోపించారు. ప్రకాశ్రాజ్ భారతీయనటుడని, ఆయన తెలుగువాడు కాదని విమర్శించే వాళ్లు సినిమాల కోసం ఎలా కావాలంటారని ప్రశ్నించారు. చిన్న, పెద్ద సినిమా ఏదైనా వాళ్లకు ప్రకాశ్రాజ్ కావాలని అన్నారు.
‘‘ప్రకాశ్రాజ్ కూరలో ఉప్పులాంటి వారు. ఆయన చిన్న సినిమా వాళ్లకు, పెద్ద సినిమా వాళ్లకూ కావాలి. నటుడిగా ఉత్తమ స్థాయిలో ప్రకాశ్రాజ్ను అందరూ ఒప్పుకోవాల్సిందే! ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్రాజ్ పోటీ చేస్తారని అస్సలు ఊహించలేదు. అసోసియేషన్ కోసం కొన్ని సినిమాలు కూడా వదులుకుంటానని ఆయన నాతో చెప్పారు. ఒక్క సినిమాకు కోటి రూపాయలు తీసుకునే దమ్మున్న నటుడు ప్రకాశ్రాజ్. అంత మొత్తాన్ని వదులకుని ‘మా’ కోసం పనిచేయడానికి వచ్చారు. ప్రకాశ్రాజ్ భారతీయ నటుడు. ఆయన తెలుగువాడు కాదని, విమర్శించే వాళ్లు తమ సినిమాల కోసం మాత్రం కావాలని పాకులాడుతారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్లాంటివాళ్లు ‘ప్రకాశ్రాజ్ ఎవరు’ అని ప్రశ్నిస్తున్నారు. ఆయన అంటే అంత చులకనా?కోట శ్రీనివాసరావు ఇతర భాషల్లో నటించలేదా? ‘మా’ అసోసియేషన్కు సేవ చేస్తానని వస్తానంటే కించపరుస్తారా’’ అని ఆయన తెలిపారు.