సినిమా టిక్కెట్ల వ్యవహారంపై ముదిరిన వివాదానికి కొనసాగింపుగా నేడు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి జగన్ చర్చలకు పిలిచారు. ముఖ్యమంత్రిని కలిసి విషయంపై చర్చలు జరిపిన చిరంజీవి బయటకు వచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా వ్యాఖ్యానాలు చేశారు.
టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా తనను చర్చలకు ఆహ్వానించారని చిరంజీవి చెప్పారు. ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.
ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం ఏమై ఉంటుందా అని ఇప్పుడు చర్చ జరుగుతున్నది. లేని వివాదాన్ని సృష్టించినది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటి రాష్ట్ర ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు ఉభయతారకంగా ఉండే నిర్ణయం అనే అంశం ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.
సినిమా అందరికి అందుబాటులో ఉండాలన్న ఆయన ఆలోచన నాకు నచ్చింది అంటూ చిరంజీవి వ్యాఖ్యానం చేయడం పై కూడా పెదవి విరుస్తున్నారు. సినిమా ఒక్కటే అందరికి అందుబాటులో ఉండాలా? నిత్యావసర వస్తువులు అందరికి అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా? అని చిరంజీవిని కొందరు ప్రశ్నిస్తున్నారు.
సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని సిఎం చెప్పారు అంటూ చిరంజీవి వెల్లడించడం పలువురిని ఆశ్చర్య పరిచింది. ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు. సినిమా పరిశ్రమలో ని వ్యక్తులు ఎవరూ లేని పోనీ కామెంట్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ చిరంజీవి సన్నాయి నొక్కులు నొక్కారు.
చిరంజీవి బయటకు వచ్చి తన అభిప్రాయాలు చెప్పగానే హీరో నాగార్జున ఆ అభిప్రాయాలను స్వాగతించారు. సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపును సమర్థించిన నాగార్జున ఇప్పుడు చిరంజీవి ప్రకటనలను స్వాగతించడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం మాత్రమే జరిగిందని అనిపిస్తున్నది.