జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవాన్ని కోటబొమ్మాలి మండల రెగ్యులర్ ఎంఈఓ నిర్వహించకపోవడం అన్యాయమని శ్రీకాకుళం జిల్లా వైసిపి సీనియర్ నేత రొక్కం సూర్యప్రకాశరావు అన్నారు.
ఆ రోజు మండల హెడ్ క్వార్టర్స్ లో లేకుండా ఆయన వెళ్లిపోయాడని రొక్కం ఆరోపించారు. గత ఐదేళ్లుగా కోటబొమ్మాలి మండల విద్యాశాఖలో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడమే కాక విద్యా వ్యవస్థను ఆయన పూర్తిగా బ్రష్టు పట్టించారని ఆరోపించారు.
ఎంఈవో హెడ్ క్వార్టర్స్ లో ఉండకపోవడంతో టీచర్లు కూడా ఉండటం లేదని ఆయన అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారని ఆయన అన్నారు.
ఎం ఆర్ సి గ్రాంట్ దుర్వినియోగం, మెడికల్ లీవులు ఎస్ ఆర్ లో ఎంటర్ కాకుండా జీతాలు చెల్లించడం, వివిధ ట్రెజరీ బిల్లులకు డబ్బులు వసూలు చేయడం, ఆఫీసు పనివేళలు తర్వాత బినామీ వ్యక్తులతో కార్యాలయం పనులు చేయించడం, తిత్లీ తుఫాను సెలవులు అనర్హులైన తన అనుయూయలకు మంజూరు చేయడం లాంటి ఎన్నో అక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని ఆయన అన్నారు.
ఉపాధ్యాయులకు అన్యాయం చేయడం, కొంతమంది ఉపాధ్యాయులను మాత్రమే ఎం ఆర్ సి లో ఉంచి ఆఫీసుకు చెందిన ముఖ్యమైన వ్యవహారాలు వారితో చేయించడం లాంటి ఎన్నో మరెన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నా పై అధికారులు దృష్టి సారించడం లేదన్నారు. ఈ అంశాలన్నింటిని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.