ఓ వైపు జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో 150 సీట్లకు గాను ఎన్నికల శంఖారావం పూరించడం మరోవైపు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు తారాస్థాయికి చేరుతుండడంతో గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 99 సీట్లను కైవసం చేసుకోగా, ఎంఐఎం 44 సీట్లను సొంతం చేసుకుంది. 7 సీట్లను మిగతా పార్టీలు పంచుకున్నాయి.
ఎవరికెన్ని సీట్లు
ఈసారి పోటీ మాత్రం రసవత్తరంగా ఉండడంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ మాత్రం తన సీట్లు ఎక్కడికి పోవనే ధీమాలో ఉంది. అంటే గతంలో వచ్చిన 44 సీట్లలో మాత్రం ఎంఐఎం పక్కాగా హస్తగతం చేసుకోనుందనేది తెలుస్తుంది. ఇక మిగిలిన 106 సీట్లలో అధికార పక్షమైన టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించబడుతున్న బీజేపీ, కాంగ్రెస్లు, అఖిలపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులేగాక ఎంఐఎం కూడా పోటీలో ఉన్నాయి.
నోరు జారీన మంత్రి కేటీఆర్!
ఈ నేపథ్యంలో గతంలో కేవలం 41 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ఈసారి కూడా అదేరీతిలో ఓటింగ్ జరుగుతుందా? లేదా ఓటింగ్ శాతం పెరుగుతుందా? అనేది కూడా ప్రశ్నే! ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఓటరు మహాశయులు నేతల మాటలతో తీవ్ర ఈసడింపులు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ స్వయంగా ఓటరు మహాశయులకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నోరు జారీ తమకు ఓటు వేయకపోయినా నోటాకైనా వేయండి అంటూ కామెంట్స్ చేయడం విశేషం.
మేయర్ సీటు ఎంఐఎందేనా?
ఒకవేళ ఓటర్లు స్పందించి ఓటు వేసినా మరో 20 శాతం కంటే ఓట్లు అంటే 60 శాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉండొచ్చని దీని ద్వారా కూడా పెద్దగా గెలుపోటములపై ఏ పార్టీ గెలుస్తుందనే ఒక అంచనాకు రాలేమని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే మొత్తానికి ఆయా పార్టీల ధీమాలను పక్కన పెడితే ఎంఐఎం పార్టీ సీట్లు మాత్రం పక్కా అనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో మేయర్ సీటుపై ఎంఐఎం పాగా వేసే అవకాశాలు కూడా ఉండడం విశేషం.
ఆయా పార్టీల కుంపట్లలో మేయర్ సీటును కాస్త ఎంఐఎం ఎగరేసుకుపోతుందనే వాదనలు లేకపోలేదు.