ఎంఐఎంతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని, మిలాఖత్ కాకుంటే పాతబస్తీలో కేసీఆర్ ఎందుకుప్రచారం చేయడం లేదో? చెప్పాలని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఎంఐఎంకు మేయర్ పదవి దక్కితే పాతబస్తీలో ఉన్నహిందువులను తరిమిసే పరిస్థితి వస్తుందని దీన్ని ప్రజలు, ఓటర్లంతా గమనించాలన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్కు ఓటేస్తే రాష్ర్టంలో ఇద్దరు సీఎంలు ఉంటారని ఎద్దేవా చేశారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్ కార్యకర్తలు, రఘునందన్ పనితీరు వల్లే దుబ్బాకలో బీజేపీ విజయఢంకా మోగించిందన్నారు. దుబ్బాక మాదిరే భాగ్యనగర ఫలితాలు ఉండబోతున్నాయని జోస్యం చెప్పారు. దీనికి ప్రజలంతా తమకు సహకరించి ఓటు వేయాలని కోరారు.
రోజు రోజుకు బీజేపీ బలపడుతుందన్నారు. అన్ని సర్వేల్లో బీజేపీ విజయం ఖాయమని తేలిందన్నారు. ఐదేళ్ళలో నిరుద్యోగుల ఆకలికేకలు టీఆర్ఎస్ పట్టించుకుందా? అని ప్రశ్నించారు. నోటిఫికేషన్లు ఇప్పటివరకూ లేవని, కేసీఆర్, కేటీఆర్ల నిర్లక్ష్యం వల్లే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే సత్తా కేవలం బీజేపీకే ఉందని భాగ్యనగరాన్ని కాస్త విషాదనగరంగా మార్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బస్తీ నిద్ర
రేపు(మంగళవారం) జీహెచ్ఎంసీలో బీజేపీ ‘బస్తీ నిద్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ చెప్పారు. టెలికాన్ఫరెన్సులో నాయకులను ఉద్దేశించి ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘బస్తీ నిద్ర’కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించారు. బస్తీ నిద్ర కార్యక్రమంలో తనతోపాటు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పాల్గొంటామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తాను బస్తీ నిద్ర చేస్తానన్నారు. బస్తీ నిద్ర కార్యక్రమంలో సామాన్యులు నివసించే ప్రాంతాల్లోనే నిద్ర చేయాలన్నారు. అక్కడయితే సామాన్యుల సమస్యలు పూర్తిగా తెలుసుకున్న వారమవుతామని తద్వారానే వారి సమస్యలు పరిష్కరించేందుకు వీలు కుదురుతుందని అన్నారు. బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన తరువాత కూడా ‘బస్తీ నిద్ర’ కార్యక్రమాన్నివారానికి ఒక్కసారైనా నిర్వహించి తీరాలని స్పష్టం చేశారు.