తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేసి ఏదో లబ్ది పొందాలనుకునే కుహనా రాజకీయ నాయకులను నమ్మవద్దని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. తాను కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లుగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాను TRS పార్టీ వీడనని, వేరే ఏ ఇతర పార్టీ లో చేరనని జూపల్లి ప్రకటించారు.
TRS పార్టీ నాయకత్వంతో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, విభేదాలు ఏ మాత్రం లేవని ఆయన తెలిపారు. నామినేటెడ్ పోస్టులకోసం ఆరాటపడే స్థాయిలో తాను లేనని జూపల్లి తెలిపారు. ఐదు సార్లు గెలిపించిన నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలతో నిత్యం ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వారిని చైతన్యం చేస్తూ ప్రజలు వాటిని పొందేటట్లు చూడడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. అదే విధంగా ఇతర సామాజిక చైతన్య కార్యక్రమంలో కూడా తాను చురుకుగా ఉంటున్నానని జూపల్లి తెలిపారు.
“ప్రజలతో మమేకం కావడం అంటే పార్టీని బలోపేతం చేయడమేనన్నది సోషల్ మీడియా ట్రోలర్స్, చీప్ మైండ్ గేమ్ ప్రత్యర్థులు గుర్తించుకోవాలని సూచిస్తున్నాను” అని ఆయన అన్నారు. పనిగట్టుకుని తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు అంటే తమ బలహీనతలు కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యర్థులు తప్పుడు రాతలతో పోస్ట్ లు పెడుతున్నారని జూపల్లి అన్నారు.
చీప్ పాలిటిక్స్ ఎత్తుగడైన అయిఉండవచ్చునేమో కానీ, టిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పోవాల్సిన అవసరం తనకు లేదని తప్పుడు ఆరోపణలు, ఊహాగానాల రాతలతో తన రాజకీయ వ్యవహారాల పై ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూసే వారిపై చట్టపరమైన చర్యలకై ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నానని జూపల్లి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు నాయకులు, కార్యకర్తలు, తన ప్రత్యర్థులు సృష్టించే ఫేక్ న్యూస్ లకు గందరగోళ పడవద్దని, తాను ఇతర ఏ పార్టీలోకి వెళ్లడం లేదని మరోసారి గుర్తు చేస్తూ ఫేక్ న్యూస్ లను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జూపల్లి తెలిపారు.