మార్చి నెల 15వ తేదిలోపు అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట జిల్లా దుద్దేడ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ నిర్మాణ పనులను బుధవారం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ లతో కలిసి పరిశీలించారు. ఉగాది పండుగ సందర్బంగా మార్చి 25వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న మొదటి కొత్త కలెక్టరేట్ కాబట్టి., ఆ స్థాయిలో నిర్మాణ పనులు భేషుగ్గా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు పలు అసంపూర్తి నిర్మాణ పనులపై ఆరా తీస్తూనే ఆయా శాఖల వారీగా ఫోనులైనులో అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్ బీ ఈఈ సుదర్శన్, డీఈ రవి, వివిధ శాఖలకు చెందిన అధికారిక సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.