స్వరాష్ట్రానికి కాలినడకన బయలుదేరిన వలస కార్మికులు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు మాటలు విని వెనుదిరిగిన సంఘటన జరిగింది. వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్లడాన్ని హరీష్ రావు నేటి ఉదయం మనోహరాబాద్ సరిహద్దు ప్రాంతంలో గమనించారు.
వెంటనే వారి వద్ద కారు ఆపి వారి విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదారు రోజుల నుంచి కాలినడకన ప్రయాణం చేస్తున్నామని వారు తెలిపారు. హైదరాబాద్ లో తమకు పని దొరకడం లేదని, డబ్బులు లేకపోవడంతో ఆహారం కూడా లేదని, ఈ కారణంతో తమ స్వంత రాష్ట్రాలకు బయలుదేరినట్లు వలస కార్మికులు మంత్రికి చెప్పారు.
వారి మాటలకు చలించిపోయిన మంత్రి హరీష్ రావు లాక్డౌన్ నేపధ్యంలోఎక్కడికి వెళ్లవద్దని వారికి నచ్చ చెప్పారు. మనోహరాబాద్ లోనే ఆశ్రయం కల్పిస్తానని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చెప్పినా వారు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వరాష్ట్రాలకు వెళతామని వారు సమాధానమిచ్చారు.
అయితే దారిలో ఎదురయ్యే కష్టాల గురించి మంత్రి వారికి వివరించారు. పిల్లలతో కాలినడకన వెళ్లడంశ్రే యస్కరం కాదని…ఇక్కడే ఉండాలని నచ్చచెప్పడంతో చివరకు వలస కార్మికులు అంగీకరించారు. స్థానికంగా ఉండేందుకు అన్ని రకాలుగా సాయం అందిస్తానని వారికి హామీ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు.