సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలో మల్బరీ తోటల సాగు విరివిగా చేపట్టాలని సోమవారం ఉదయం మల్బరీ రైతులు ఉమాపతి, ప్రభాకర్ ల వ్యవసాయ క్షేత్రాలలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మల్బరీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం జిల్లా ఉద్యాన-పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో మల్బరీ సాగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరై నియోజకవర్గ పరిధిలోని అన్నీ గ్రామాల సర్పంచ్ లు, ఏంపీటీసీలు, గ్రామ, మండలాల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులను అవలంబిస్తే.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చని, ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో మల్బరీ తోటలు సాగు మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందని మంత్రి పేర్కొన్నారు.
హార్టికల్చర్ అధికారులు సలహాలు సూచనలను పాటిస్తే మల్బరీ పంట సాగు చేస్తూ తక్కువ కష్టంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించొచ్చని, ఈ విషయాన్ని మల్చరీ తోట సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారని మంత్రి హరీశ్ రావు వివరించారు.