నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో పట్టణంలో నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలిసి మ్యాప్ ల ద్వారా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మల్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నూతనంగా చేపట్టే అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే పట్టణ ప్రగతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు.
బస్టాండ్ ప్రాంతంలో నూతనంగా నిర్మించే మోడల్ మార్కెట్, మంచిర్యాల చౌరస్తా నుండి న్యూ బస్టాండ్ వరకు రహదారి అభివృద్ధి పనులు, ధర్మసాగర్ చెరువు, బత్తిస్ ఘడ్, శ్యామ్ ఘడ్ కోట సుందరీకరణ, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం, పట్టణంలో అనువైన చోట జాతీయ పతాకం ఏర్పాటు వంటి పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, మునిసిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, డిఈ సంతోష్ కుమార్, నాయకులు రాంకిషన్ రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.