కరోనా సమయంలో రేయింబవళ్లు కష్టపడి పని చేస్తూ, కొవిడ్ వల్ల మరణించిన అటవీ ఉద్యోగుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరొసానిచ్చారు.
విధినిర్వహణలో కోవిడ్ సోకి ప్రాణాలు కొల్పోయిన అటవీ ఉద్యోగులకు నిర్మల్ పట్టణంలోని అటవీ శాఖ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
నిర్మల్ జిల్లాలో కరోనా సోకి ఐదుగురు అటవీ ఉద్యోగులు మరణించగా, తోటి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో అటవీ శాఖ ఉద్యోగులు రూ. 2.50 లక్షల నిధులు సేకరించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 50 వేల అర్థిక సహాయాన్ని అందజేశారు. తోటి ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడి, వారికి ఆర్థికచేయూనతనిందించిన అటవీ ఉద్యోగులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
అటవీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని సకాలంలో అందేలా చూస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, అటవీ శాఖ అధికారులు వికాస్, లావణ్య,ఇతర అధికారులు పాల్గొన్నారు.