లాక్ డౌన్ను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్రజలపైన ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో లాక్ డౌన్ అమలు తీరుతెన్నులను మంత్రి పర్యవేక్షించారు.
బస్ స్టాండ్ ఏరియా, బుధవార్ పేట్, గాంధీ చౌక్, బంగల్ పేట్, బాలాజీ వాడ, బ్రహ్మపురి, తదితర ప్రాంతాల్లో కలియతిరుగుతూ పరిస్థితులను పరిశీలించారు. కూరగాయాల దుకాణాలు, రేషన్ షాపులను పరిశీలించి దుకాణాదారులతో మాట్లాడారు.
కరోనా కట్టడికి భౌతిక దూరం పాటించాలని, మాస్క్లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఒక చోట గుమిగూడవద్దని కర్ఫ్యూ సమయంలో బయటకు రావద్దని కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరం అనుకుంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.
ప్రజలు, ప్రజాప్రతినిదుల సహకారంతో నిర్మల్ పట్టణం రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వచ్చామని, ప్రజలు ఈ విధంగా సహకరిస్తే త్వరలోనే గ్రీన్ జోన్ లోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం, పారిశుధ్ద్య కార్మికులు ఎంతో గానో కృషి చేశారని, వారి సేవలు మరువలేమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్ఎస్సాసీయస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.