కరోనా నియంత్రణకు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రజల్లోనే ఉంటున్నారు. గ్రామాలు,నిర్మల్ పట్టణంలో తిరుగుతూ లాక్డౌన్ అమలును పరిశీలిస్తున్నారు. పేదలు, వలస కార్మికుల ఇబ్బందులను తెలుసుకొని.. ప్రభుత్వం తరపున సాయం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం దివ్యా గార్డెన్ లో పారిశుద్ద్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భోజనం చేశారు. కరోనా నియంత్రణకు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు చేస్తున్న సేవలకు గానూ వారిని శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ… లాక్ డౌన్ సమయంలో మీరందరూ వైద్యులు, పోలీసులతో పాటు తీవ్రంగా శ్రమిస్తున్నారని అభినందించారు. కరోనా వ్యాప్తి సమయంలో రాత్రనక, పగలనక కష్టించి పట్టణాన్నిపరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్మికుడిని పలకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కమిషనర్ బాలకృష్ణ, అడిషన్ ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎఫ్ఎస్సాసీయస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.