రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రైతు రాజ్యంలో ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. అయిదు వేల మందికి ఒక వ్యవసాయ శాఖాధికారిని నియమించిన ప్రభుత్వం రైతువేదికల ద్వారా సంఘటితం చేయనుందన్నారు.
సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తండ్రి దివంగత శానంపుడి అంకిరెడ్డి స్మారకర్థం నిర్మించ తల పెట్టిన రైతువేదికకు శుక్రవారం మధ్యాహ్నం మంత్రి జగదీష్ రెడ్డి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రైతును ఆర్ధికంగా పరిపుష్టం చెయ్యడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ చేపట్టిన ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల మళ్ళింపు, రైతుబందు, రైతుభిమా,వ్యవసాయ ఋణాల మాఫీలతో ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసిందన్నారు.
తద్వారా రైతులకు వ్యవసాయంపై విశ్వాసం పెరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షత వహించిన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జడ్ పి టి సి జగన్ నాయక్,యం పి పి కొండా పార్వతి తదితరులు పాల్గొన్నారు.