రైతాంగంపై బిజెపి దాడికి పూనుకుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో 2014 తరువాత గాడిలో పడుతున్న వ్యవసాయాన్ని కార్పొరేట్ కు అప్పగించేందుకు మోడీ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు.
ఆదివారం సాయంత్రం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలో జరిగిన మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరయ్యారు. స్థానిక శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులై బాధ్యతలు చేపట్టిన జడల ఆది మల్లయ్య యాదవ్ ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చాకా రైతాంగం నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థ లకు వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా దారాదత్తం చెయ్యబోతుందో అన్నది చెప్పారు.
అది కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యుత్ చట్టం అయినా వ్యవసాయ చట్టం అయినా పరోక్షంగా కార్పొరేట్ రంగానికి వ్యవసాయ రంగాన్ని అప్పగించే కుట్రలో అది భాగమే అవుతుందని ఆయన విమర్శించారు. భారతీయ జనతా పార్టీ విషయం లో తెలంగాణా రైతాంగం అప్రమత్తంగా ఉండాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు.
బిజెపి పాలిత రాష్ట్రాలలో కాదు కదా మోడీ సొంత రాష్ట్రంలో కూడా రైతు బంధు రైతు భీమా వంటి పథకాలను కాదు కదా కనీసం వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ నందించలేని బిజెపి దైన్య స్థితిని రైతాంగం గుర్తించాలన్నారు.
యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణా రాష్ట్రం వైపు చూస్తుంటే మోడీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి వ్యవసాయ రంగానికి గొడ్డలి పెట్టు లా నిలిచిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు.