వూహాన్ లో ఉన్న తెలుగువారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ లేఖ రాశారు. చైనా వూహాన్లో ఉన్న అన్నెం జ్యోతి, టి.సత్యసాయి కృష్ణను స్వదేశానికి తీసుకురావాలని జైశంకర్కు చంద్రబాబు రాసిన లేఖకు ఆయన స్పందించారు.
జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై కేంద్రం, బీజింగ్లోని భారత రాయబార అధికారులు తెలుసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇద్దరికి తీవ్రమైన జ్వరం ఉందని అధికారులు తెలిపారన్నారు. జ్యోతి, సాయికృష్ణ, కుటుంబసభ్యులు, వూహాన్లో ఉన్న వైద్యులతో ఎంబసీ అధికారులు టచ్లో ఉన్నారని లేఖలో తెలిపారు.
ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులకు సూచించామన్నారు. జ్యోతి, సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ ఉంటామని చంద్రబాబుకు రాసిన లేఖలో జైశంకర్ వివరించారు.