ఏ ప్రాంతంలో రాజధాని వస్తుందో చంద్రబాబు, లోకేష్ లు వారి సన్నిహితులు, సహాయ, సహకారాలు అందించే వ్యాపారవేత్తలు, వివిధ వ్యవస్థలకు సంబంధించిన వారికి ముందుగానే చెప్పారని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు.
బుధవారం కృష్ణా జిల్లా గుడివాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వీరంతా ఎకరం రూ. 25 లక్షలు, రూ.30 లక్షల చొప్పున భూములను కొనుగోలు చేశారని, కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు సహకరించారని మంత్రి అన్నారు.
ఈ విషయాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చెబుతూనే వచ్చారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వేసి, ప్రాథమిక సమాచారం సేకరించి, సిట్ ను కూడా ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.
గత మార్చి నెలలోనే రాజధాని భూ వ్యవహారాలకు సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుందని మంత్రి నాని వెల్లడించారు.
కరోనా ప్రభావం, సిబిఐకి దేశ వ్యాప్తంగా అనేక కేసులు ఉండటం వల్ల గాని ఆరు నెలలైనా స్పందించలేదని, దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే రాష్ట్ర దర్యాప్తు సంస్థను విచారణ జరపాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి తెలిపారు.
రాజధాని భూముల వ్యవహారంలో అమాయకులను ఇరికించే పరిస్థితి ఉండదని, సంబంధం ఉన్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా దమ్ముగా, ధైర్యంగా వారిపై కేసులు పెట్టి న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తెలిపారు.
వ్యవస్థల్లో, కలుగుల్లో దాక్కున్న వారిని కూడా బయటకు తీసుకు వస్తామని ఆయన అన్నారు. న్యాయస్థానాల్లో తాత్కాలికంగా తప్పించుకోవచ్చు గాని, ప్రజా కోర్టులో ఎవరు తప్పించుకోలేరని మంత్రి తెలిపారు.