గల్ఫ్ దేశాలలో జీతభత్యాలు తగ్గించడం చాలా బాధకలిగిస్తున్నదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
టిఆర్ఎస్ ఖతర్ శాఖ రూపొందించిన 2021వార్షిక కేలండర్ ను హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ఖతర్ శాఖ ఉపాధ్యక్షుడు నర్సయ్య, నాయకులు నరేష్, మారుతిలతో మంత్రి గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డల జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, కువైట్, ఒమన్,ఖతర్, ఇరాన్ తదితర దేశాలలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వేలాది మంది పనిచేస్తున్న విషయం తెలిసిందే.
వీరిలో చాలా చిరుద్యోగులే.వీళ్ల జీతాలలో సగానికి పైగా మొత్తాన్ని తగ్గించాలంటూ ప్రధానమంత్రి మోడీ ఏకపక్షంగా నిర్ణయించి ఉత్తర్వులివ్వడం పట్ల మంత్రి కొప్పుల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తెచ్చి ప్రధానికి వివరించవలసిందిగా కోరుతానని టిఆర్ఎస్ నాయకులకు మంత్రి హామీనిచ్చారు.