కరోనా విపత్తులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశావర్కర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
నేడు ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ఏరియా ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులను పరామర్శించారు.
ఆయన వెంట ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ శర్మన్ తదితరులు ఉన్నారు.
వైద్యరంగానికి ఈ సమాజం రుణపడి ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సమాజంలో కరోనా ప్రబలకుండా వైద్య రంగానికి చెందిన వారు చేస్తున్న కృషి గొప్పదని అన్నారు.
ఎవరూ కూడా కరోనా సోకిందని అధైర్యపడవద్దు .. ధైర్యమే కాపాడుతుంది అని మంత్రి తెలిపారు.
వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడుతూ హోం ఐసోలేషన్ పాటించాలని ఆయన కోరారు.
అధైర్యంగా ఉన్న వారిలోనే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారని మంత్రి తెలిపారు.
విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉందని, త్వరలోనే ఈ కరోనా నుండి బయటపడతామని ఆశిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఎం& హెచ్ఓ సుధాకర్ లాల్ ఆర్డీవో అమరేందర్, ఆస్పత్రి ఆర్. ఎం. ఓ. డాక్టర్ చైతన్య గౌడ్, సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ సాగర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ కౌన్సిలర్లు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ
సీనియర్ విలేకరి