రాజకీయాలు పక్కన పెట్టి ఖమ్మం నగరాన్ని సుందరీకరణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన నేడు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి కూడా పాల్గొన్నారు. కొత్త పనులను ప్రతిపాదించకుండా అసంపూర్తిగా ఉన్న పనులు, మధ్యలో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. నగరంలోని రహదారులపై చెత్త, చికెన్ వేస్ట్, కొబ్బరి బొండాలు, పాత వాహనాలు నిలిపిన వారి పై పోలీసులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మున్సిపల్ కార్పోరేషన్ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు మమత ఆసుపత్రి నుండి ఉచిత హెల్త్ కార్డ్స్ ఇస్తామని మంత్రి తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 7 కమ్యూనిటీ హాల్ ల కోసం టెండర్లు పిలిచి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. నగరంలో అన్ని ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలను యుద్ధం ప్రాతిపదికన పూడ్చే పనులు ప్రారంభించాలని ఆర్&బి అధికారులకు మంత్రి ఆదేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మున్సిపల్, విద్యుత్, R&B అధికారులు, అన్ని డివిజన్ల కొర్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.