ఆసియాలోనే అతిపెద్దదైన, విశిష్టమైన డోర్నకల్ చర్చిలో క్రిస్మస్ పర్వదినం వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. డోర్నకల్ ప్రాంత కష్ట, సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ చర్చి ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి సత్యవతి అన్నారు.
ఈ చర్చితో, ఇక్కడి ప్రజలతో గత 30 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా డోర్నకల్ చర్చి ద్వారా ఈ ప్రాంత ప్రజలు మరింత అభివృద్ధి జరిగేలా ఆశీర్వదించాలని ఆ కరుణామయుడైన ఏసు ప్రభును కోరుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే సిఎం కేసిఆర్ కి మరింత శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు.
డోర్నకల్ ప్రాంతం గత కొన్నేళ్లుగా కావాల్సిన అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు ఆ అభివృద్ధి జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్.ఆర్.ఎస్.పీ ద్వారా నేడు డోర్నకల్ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.