నిజామాబాద్ ఎంపీ అరవింద్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అబద్దాలతో ఒకసారి సక్సెస్ అయ్యాడు, ఇక ప్రజలు నమ్మరు అని మంత్రి అన్నారు. బాల్కనీలో నిలబడి రోజుకొక అబద్ధం ఆడటం కాదు, రైతులకు మేలు చేసే పని చెయ్యి అని అరవింద్ కు మంత్రి హితవు పలికారు.
నిజామాబాద్ జిల్లా మోతే గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రైతుల మీద ఎంపీ కి అంతా ప్రేముంటే తెల్ల జొన్నలు, సన్ ఫ్లవర్ కోటా పెంచేలా చేయ్యాలని, ట్రాన్స్ పోర్ట్, మిల్లింగ్ చార్జీలు ఇప్పించాలని మంత్రి సూచించారు.
చిత్తశుద్ధి ఉంటే పసుపుబోర్డు తీసుకుని రా
రైతులపై అంత ప్రేమ ఉంటే పసుపు బోర్డు తీసుకురా…. పసుపు కొనుగోలు చేయించు అని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మక్కలు 70 శాతం కేంద్రంతో కొనిపించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న ధాన్యం భవిష్యత్తులో కేంద్రం కొనుగోలు చేస్తుందో లేదో తెలియదని, అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొంటున్నారని మంత్రి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం ఒక వేళ కేంద్రం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని మోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఈ వెయ్యి కోట్ల రూపాయల భారాన్ని ఎంపి అర్వింద్ మోడీతో చెప్పి రాష్ట్రానికి ఇప్పించాలని మంత్రి డిమాండ్ చేశారు. శెనగలు కూడా కేంద్రం కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నదని, 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని ఆయన అన్నారు.