చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా కట్టడికై చేపట్టిన సహాయ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మమత వైద్య విద్య సంస్థ ఛైర్మన్, రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ భారీగా విరాళాన్ని ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు.
కోవిడ్ -19 మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వవలసినదిగా సి.ఎం చేసిన అభ్యర్ధనకు స్పందించి మంత్రి తన నియోజకవర్గమైన ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో విరాళాలను పోగు చేశారు. వివిధ వర్గాలకు చెందిన దాతల నుంచి చెక్కు రూపంలో సేకరించిన రూ.1.75 కోట్లతో పాటు తమ మెడికల్ కాలేజీ నుంచి రూ.25 లక్షలను అదనంగా జోడించి మొత్తం రూ.2 కోట్ల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.
సోమవారం ప్రగతిభవన్ లో నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆ మొత్తాన్ని అందజేయగా మంత్రిని సి.ఎం అభినందించారు. ప్రజలు స్వీయ నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతూ కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.