తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రగతి భవనంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు.
ఖమ్మం కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు కేటాయించిన నిధులు, పనుల వివరాలు మంత్రి పువ్వాడను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ పరిధిలో మంజూరు చేసిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయని వివరించారు.
మరి కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ పనుల స్థిగతుల వివరాలను మంత్రి పువ్వాడను ముఖ్యమంత్రి కేసీఆర్ వాకబు చేశారు.
ఆయా పనులపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు తనకు ఆయా పనుల సమాచారం వస్తుందని ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
6.20 లక్షల ఎకరాలు గోదావరి జలాలతో తడపాలని తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఆయా బాధ్యతలు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు.
మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ నాయక్ ఉన్నారు.