సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఏరియా వైద్యశాలలో సోమవారం మధ్యాహ్నం స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన కోవిడ్ పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా మంత్రి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా పరీక్షలు,వ్యాక్సిన్ సరఫరా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధి లోనిదని అన్నారు. ఐ సి యం ఆర్ నిబంధనలు దాటి ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని,అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్లోబల్ టెండర్లకు అనుమతులు కోరారని అన్నారు.
టి ఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక శాఖ, ఐటి శాఖామంత్రి తారకరామారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని వేసిందని ఆయన గుర్తుచేశారు.
కేటీఆర్ అధ్యక్షతన వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తుందని విధి విధానాలు రాగానే వ్యాక్సిన్ ను అందజేయనున్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని, కోవిడ్ పరీక్షలు అందరికి అక్కరలేదని, అనుమానితులు మాత్రం విధిగా చేపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సర్వేలో అనుమానితులను గుర్తించడం జరుగుతుందని అన్నారు.
ఇప్పటి వరకు హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఏడూ మండలాలో 184 గ్రామ పంచాయతీలలో 85,531 ఇండ్లలో సర్వే నిర్వహించగా అందులో 3,289 మందికి పాజిటివ్ గా గుర్తించినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు.
కోవిడ్ శత్రువుల నుండి రావడం లేదని, అయిన వారి నుండి వ్యాపిస్తుందని, అటువంటి వారు ఆత్మీయులకు దూరంగా ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలలో ఉండాలని కోరారు. హుజుర్ నగర్,కోదాడ లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలు సరిపోక పోతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు.
జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఐసోలేషన్ కేంద్రాలలో వైద్య సేవలతో పాటు భోజనాది సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్ పేషంట్లకు అయ్యే ఖర్చు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి భరోసా ఇచ్చారని, ఏ ఒక్కరూ భయాందోళనకు గురి కావొద్దని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం కాపాడుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట డి యం హెచ్ ఓ కోటాచలం,డిప్యూటీ డి యం హెచ్ ఓ హర్షవర్ధన్, డి సి హెచ్ వెంకటేశ్వర్లు,ఏరియా ఆస్పత్రి సూపరెండేంట్ కరుణ్ కుమార్ లతో పాటు జడ్ పి టి సి సైదిరెడ్డి, యం పి పి గుడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,స్థానిక ఆర్ డి ఓ వెంకారెడ్డి, తహసీల్దార్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.