విశాఖపట్నంలో స్టైరిన్ గ్యాస్ ఇప్పటికి 60 నుంచి 70 శాతం కంట్రోల్ లోకి వచ్చిందని రాష్ర్ట టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ లో పరిస్థితిపై ఎన్డీఆర్ఎఫ్, ఎల్జీ కొరియన్ గ్రూప్ అధికారులతో ఆయన నేడు సమావేశం అయ్యారు.
ఆ వాయువును స్లోగా కంట్రోల్ చేయాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని సాయంత్రానికి లేదంటే రేపు ఉదయానికి కంట్రోల్ చేస్తాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పారు. నార్మల్ స్టేజికి తీసుకువస్తామని వారు వివరించారు అని మంత్రి తెలిపారు.
బ్లాస్ట్ అవుతుందనే పుకార్లు నమ్మవద్దు
గుజరాత్, నాగపూర్ నుంచి టెక్నికల్ టీమ్స్ వచ్చాయని వారితో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు. బ్లాస్ట్ అవుతుందని, మరో విధంగా వస్తున్న వదంతులు ఏవీ నమ్మద్దు. పరిస్ధితి పూర్తిగా అదుపులో ఉంది. ప్రజలు ఆందోళనకు గురికావద్దు అని మంత్రి వెల్లడించారు. టెక్నికల్ టీమ్స్ పనిచేస్తున్నాయని, కంట్రోల్ చేసే మెటీరియల్ కూడా వచ్చిందని మంత్రి తెలిపారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించామని ఆయన అన్నారు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోది, ఇటు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.