తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఎవరూ ఊహించని సంఘటన ఎదురైంది. గురువారం సాయంత్రం మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో ఓ వివాహ వేడుకకు శ్రీనివాస్ గౌడ్ హాజరు అయ్యారు. వివాహ వేడుకలో చాలా మంది మంత్రితో సెల్ఫీలకు పోటీపడ్డారు. ఎంతో ఉత్సాహంగా ఆయన అందరితో సెల్ఫీలు దిగారు.
సెల్ఫీ తతంగం అయ్యాక చూసుకుంటే చేతికి ఉండే కడియం మాయమైంది. కుడిచేతి బంగారు కడియాన్ని ఎవరో కొట్టేశారు. హతవిధీ ఇదేంటి ఇలా జరిగింది? అంటూ ఆయన బాధపడిపోతున్నారు. ఏం చేస్తాం? మంత్రి అయితే మాత్రం దొంగల బారిన పడకూడదని రూలేమైనా ఉందా? ఆ కడియాన్ని శ్రీనివాస్ గౌడ్ సెంటిమెంటుగా భావిస్తారని అనుచరులు చెబుతున్నారు. అందుకే అక్కడే ఉన్న పోలీసులు, గన్మెన్లపై ఆయన ఫైర్ అయినట్టు తెలుస్తోంది. తన కడియాన్ని దొంగిలించిందెవరో గుర్తించి తిరిగి తీసుకురావాలని వారిని ఆదేశించినట్టు సమాచారం. మంత్రి ఆగ్రహంతో పోలీసులు పెళ్లి వేడుకకు వచ్చినవారిని కడియం గురించి ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఎవరైనా కడియం తస్కరించి ఉంటే తిరిగి ఇచ్చేయాలని అక్కడికి వచ్చినవారికి విజ్ఞప్తి చేశారట. ఇంకా కడియం మాత్రం దొరకలేదు.