చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తున్న వస్త్రరంగ పరిశ్రమ కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలోకి చేరుకున్నదని, అందువల్ల తక్షణమే ఆ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు.
నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత, మరమగ్గ వృత్తిదారుల విద్యుత్ సంబంధిత ప్రధాన సమస్యలను తీర్చాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఆమె వినతి పత్రం సమర్పించారు. నగరి నియోజకవర్గం, పరిసర ప్రాంతాలలోని చేనేత, మరమగ్గ కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూలు ధరలు బాగా పెరగడంతో ఉత్పత్తుల నిల్వ అమ్ముడు కాకుండా పోయినందున సరాసరి వృత్తిదారుడు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయాడని ఈ సందర్భంగా మంత్రి రోజా తెలిపారు. ఇటువంటి కఠిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నగిరి నియోజకవర్గ పరిసర ప్రాంతాలలోని మరమగ వృత్తిదారులకు 20 లక్షల మీటర్ల స్కూల్ యూనిఫామ్ లు తయారు చేయడానికి ప్రభుత్వ ఆర్డర్లు మంజూరు చేసి ఆదుకున్నారని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా “నేతన్న నేస్తం” పథకం పేరుతో ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి 24000 వేల రూపాయలను అందించి నేనున్నానంటూ భరోసా ఇచ్చారని కూడా మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రధాన విద్యుత్ సమస్యలైన విద్యుత్ బిల్లులను కేటగిరీ IV కు మార్చాలని, పక్క రాష్ట్రం తమిళనాడులో ఇస్తున్న విద్యుత్ బిల్లులు మినహాయింపు మన రాష్ట్రంలో కూడా కనీసం 500 యూనిట్ల వరకు ఇవ్వాలని దానికి విద్యుత్ శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకొని మరమగ్గ మరియు చేనేత వస్త్ర రంగాన్ని ఆదుకోవాలని వారికి వినతి పత్రం ద్వారా తెలిపారు.