అన్ని రంగాలలో ముందున్నతెలంగాణ ప్రపంచంలో విద్యాప్రమాణాలకు పోటీగా తెలంగాణ విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్యనందించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే విద్యారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, మరో వైపు వ్యవసాయ రంగంపై కూడా అన్ని రకాల చర్యలు తీసుకొని రైతులకు నష్టం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం అభినందనీయమని విద్యాశాఖ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం పర్యటనలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
శుక్రవారంనాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఖమ్మం, వైరా, మధిర, పాలేరు నియోజక వర్గాల్లో విసృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలసి శ్రీకారం చుట్టారు. ఖమ్మం లోని మిని ట్యాంక్ బండ్, ఐటి హబ్ లను సందర్శించారు. కేజీబివి (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను)ప్రారంభించారు. రూ. 25 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న ఆన్లైన్ విద్య, త్వరలో ప్రారంభం కానున్న పాఠశాలల స్థితిగతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ప్రతీ నిరుపేదకు నాణ్యమైన విద్యే సీఎం లక్ష్యం
అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మార్చిలో కరోనా ముమ్మరమైన నేపథ్యంలో సుమారు 70 నుంచి 80 లక్షల మంది విద్యార్థులపై ఆ ప్రభావం పడిందన్నారు. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారు చేస్తున్నారన్నారు. ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులను ధీటుగా రూపొందించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రతీ నిరుపేదకు ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతోనే వెయ్యి గురుకులాలను ప్రారంభించారన్నారు. ఫిబ్రవరి నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలన్నారు.
వ్యవసాయ రంగంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ
ఇక వ్యవసాయ రంగం కూడా కరోనా వల్ల తీవ్ర సంక్షోభం ఎదుర్కొందన్నారు. పంట చేతికొచ్చిన సమయంలో కరోనా విజ్రంభణతో రైతులు అయోమయ పరిస్థితి నెలకొందని వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ సమయాలకనుగుణంగా సీఎం కేసీఆర్ నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని కాపాడారన్నారు. 1.40 లక్షల ఎకరాల పంట చేతికొచ్చిన సమయంలో కరోనాతో ఇబ్బందులు తలెత్తకుండా కేసీఆర్ సమన్వయంతో నిర్ణయాలు తీసుకొని రైతులకు ఉపశమనం కల్పించారన్నారు. ముఖ్యంగా విద్యారంగం, వ్యవసాయ రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తద్ఫలితంగానే ఆయా రంగాల్లో సత్ఫలితాలను సాధిస్తున్నామన్నారు.
మంత్రి వెంట ఆయా కార్యక్రమాల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అనధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.