స్త్రీలు చదువుకుంటే పాపం అనే ఛాందస భావజాలం రాజ్యమేలుతున్న ఆ రోజుల్లో మహాత్మ జ్యోతిరావు పూలే తానే గురువుగా మరి తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేను చదివించారని మంత్రి డాక్టర్ బి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 189 వ జయంతి వేడుకలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆ తదనంతర కాలంలో ఆమెను జ్యోతిబా పూలే గొప్ప ఉపాధ్యాయినిగా తీర్చిదిద్దారని తెలిపారు. సావిత్రిబాయి పూలే మహిళలకు విద్య నేర్పే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటన్నిటికీ దీటుగా జవాబిస్తూ కర్తవ్య దీక్షలో ముందుకు వెళ్లినట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే ఆశయ సాధనలో స్త్రీ సాధికారత స్వావలంబన వైపుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి విద్యావంతురాలు అయితేనే పిల్లలు ప్రయోజకులుగా సంస్కారవంతులుగా తయారవుతారని ఈ కారణంగానే రాష్ట్రంలో విస్తృతంగా బాలికల గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
భవిష్యత్తులో తమ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త కటికనేని విమల బిసి మహాసభ నాయకులు మెట్టుకాడి శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.